కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పు వచ్చింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనన్న రాజగోపాల్ రెడ్డి
  • హైకమాండ్ కు ఇదే విషయాన్ని వివరిస్తానని వెల్లడి
  • తాను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని వ్యాఖ్య
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ... ఇవన్నీ ఊహాగానాలేనని, ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. కవిత వ్యవహారంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని... ఈ అపోహలను తొలగించుకోవాల్సి ఉందని అన్నారు. పార్టీ హైకమాండ్ కు తాను ఇదే విషయాన్ని వివరిస్తానని చెప్పారు. 

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల్లో కొంచెం మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. మోదీ, అమిత్ షా తలచుకుంటే తెలంగాణలో ఇప్పటికీ బీజేపీని అధికారంలోకి తెచ్చే అవకాశం ఉందని అన్నారు. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నానంటూ మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని వ్యాఖ్యానించారు.

Komatireddy Raj Gopal Reddy
BJP
Narendra Modi
Amit Shah
KTR
K Kavitha
BRS

More Telugu News